లాక్‌డౌన్: ప్రజారవాణాకు సిద్ధం!

16 May, 2020 19:49 IST|Sakshi

బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్న బీఎంటీసీ

బెంగళూరు: కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ గడువు మే 17తో ముగియనుంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల ఇప్పటికే నిబంధనలు సడలించారు. ఈ క్రమంలో దాదాపు 54 రోజుల తర్వాత బస్సులు నడిపేందుకు బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ సంసిద్ధమవుతోంది. బస్పులు నడిపే క్రమంలో కోవిడ్‌-19 నివారణ చర్యలపై ఒక వ్యూహంతో ముందుకు సాగేలా ప్రణాళికలు రచించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ప్రజారవాణా ప్రారంభించడానికి అన్ని విధాలా సిద్ధమవుతోంది.

ఈ విషయం గురించి బీఎంటీసీ ఎండీ శిఖా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ బస్సుల్లో మిడిల్‌ సీటు లేదు. కాబట్టి భౌతిక దూరం నిబంధనలకు ఎటువంటి విఘాతం కలుగబోదు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం’’అని స్పష్టం చేశారు. కాగా బీఎంటీసీ ఆధ్వర్యంలో 6500 బస్సులు ఉన్నాయి. వీటిలో 800 ఏసీ బస్సులు. కరోనా నేపథ్యంలో వాటిని డిపోలకే పరిమితం చేయనున్నారు.

బీఎంటీసీ ముందుజాగ్రత్త చర్యలు
1. బీఎంటీసీ సిబ్బందికి ప్రతిరోజూ హెల్‌త చెకప్‌
2. ఇందుకోసం ప్రతీ డిపోలోనూ ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్‌ అందుబాటులో ఉంచాలి
3. సిబ్బందికి తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలి.
4. కోవిడ్‌-19 గురించి అప్రమత్తం చేసే నోట్లను బస్సులో అంటించాలి.
5. ప్రతిరోజూ బస్సులను రసాయనాలతో శుభ్రం చేయాలి.
6. వారం, నెలవారీ పాసులు జారీ చేయడం, టికెట్‌ డబ్బు వసూలు కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేయాలి.
7. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి
8. సామాజిక ఎడబాటు తప్పక పాటించాలి
9. జ్వరం ఉన్న వాళ్లు బస్సులు ప్రయాణాలు మానుకుంటే మంచింది.

మరిన్ని వార్తలు