14 మంది ఎమ్మెల్యేలు జంప్‌..!!

2 Sep, 2017 08:49 IST|Sakshi
14 మంది ఎమ్మెల్యేలు జంప్‌..!!

- బీహార్‌ నాయకులను కలసిన సోనియా
- బిహార్‌లో కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు


సాక్షి, పాట్నా: బిహార్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగలనుంది. కొద్ది రోజులుగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. బిహార్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఓ జాతీయ దిన పత్రిక కథనాన్ని ప్రచురించింది.

ఎమ్మెల్యేల వలసను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ బిహార్‌ నాయకులను ఢిల్లీకి పిలిపించారు. సోనియాతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌, సీపీ జోషీలు కూడా బిహార్‌ నాయకులతో మాట్లాడారు. వలసలను ఎలాగైనా నిలువరించాలని వారికి సూచించినట్లు తెలిసింది. బిహార్‌లో కాంగ్రెస్‌కు 27 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు.

ఎమ్మెల్యేలు జేడీయూలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ స్పందించింది. ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్‌లో ఉన్నారని, ఎవరూ పార్టీని ఫిరాయించబోవడం లేదని పేర్కొంది. కాగా, జులై 26న జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో బంధాన్ని తెగదెంపులు చేసుకన్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు