153కు బిహార్ వరద మృతులు

28 Aug, 2016 09:55 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్ వరదల్లో శనివారం మరో నలుగురు మృతువాత పడడంతో మొత్తం మృతుల సంఖ్య 153కు చేరింది. భోజ్‌పూర్, బెగుసరాయ్ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో 12 పంచాయతీ ప్రాంతాలు ముంపులో చిక్కుకోవడంతో మొత్తం 12 జిల్లాల్లో 34.69 లక్షల మంది వరద బారిన పడ్డారు. గంగా, సోనే, పున్‌పున్, బుర్హీ గండక్, ఘాఘ్రా, కోసి, ఇతర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో వరద తీవ్ర రూపం దాల్చడంతో శనివారం ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇంతవరకూ మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో 987 గ్రామాల్లో 8.7 లక్షల మంది ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా ఎత్తై పర్వత ప్రాంతాల్లో ఈ సీజన్‌లో మొదటి సారి మంచు కురిసింది.
 

>
మరిన్ని వార్తలు