సైక్లింగ్‌ తెచ్చిన అవకాశాలు..

25 May, 2020 06:09 IST|Sakshi
తండ్రితో జ్యోతి కుమారి

కోల్‌కతా: గాయపడిన తన తండ్రిని సైకిల్‌ పై కూర్చొబెట్టుకొని ఢిల్లీ నుంచి దర్భంగా వరకు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన బిహార్‌కు చెందిన విద్యార్థిని జ్యోతి కుమారికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక జ్యోతిని సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే ట్రయల్స్‌కు పంపుతామని, అయితే చదువే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె తండ్రి మోహన్‌ పాశ్వాన్‌ తెలిపారు. వలస కార్మికులంతా ఇళ్లకు తిరిగి వెళుతుంటే తమకు మరో మార్గం లేక పాత సైకిల్‌ కొని ప్రయాణం సాగించినట్లు తెలిపారు.

దారి మధ్యలో తాము ట్రక్కులు, ట్రాక్టర్లను పట్టుకొని ప్రయాణం చేసినట్లు తెలిపారు. దర్భంగా జిల్లా కలెక్టర్‌ జ్యోతిని ఇటీవల పిండారుచ్‌ హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. ఆమెకు కొత్త సైకిల్, యూనిఫాం, షూ అందించారు.  జ్యోతి చదువుయ్యే ఖర్చును భరిస్తామని లోక్‌ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ ప్రకటించారు. మరోవైపు జ్యోతికి సైక్లింగ్‌ లో ట్రైనింగ్, స్కాలర్‌ షిప్‌ ఇచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజును కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు