శవాన్ని ఈడ్చుకెళ్లిన పోలీసులు

16 Sep, 2016 02:25 IST|Sakshi
మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యం

వైశాలి: ఒక అనాథ శవాన్ని పోలీసులే మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలోనిది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ అయ్యి, విస్తృతంగా ప్రచారం లభించడంతో విషయం ఉన్నతాధికారులకు చేరి వీడియోలోని పోలీసులు సస్పెండ్ అయ్యారు. గంగా నదిలో అనాథ శవం ఉందంటూ బుధవారం సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. 

అప్పటికీ శవాన్ని బయటకు తీయడానికి, తర లించడానికి అవసరమైన సాధనాలు, అంబులెన్సు వంటివి ఏమీ లేకుండానే వచ్చారు. తీరానికి వందల మీటర్ల దూరంలో తమ జీపును నిలిపిన పోలీసులు, మృతదేహం మెడకు తాడు కట్టి అక్కడి వరకు ఈడ్చుకెళ్లారు. కొన్నేళ్ల క్రితం ఇదే వైశాలి జిల్లాలో ఒక గుంపు దాడి చేయగా చనిపోయిన 10 మంది మృతదేహాలను పోలీసులు నదిలోకి విసిరేశారు.

ప్రపంచానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు. గత నెలలోనే ఒడిశాలో ఓ వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని పది కి.మీ నడవడం, యూపీలో ఒకరు కూతురు మృతదేహాన్ని తరలించడానికి డబ్బుల్లేక బిచ్చమెత్తడం, ఢిల్లీలో మృతదేహాన్ని అద్దె ఇంట్లోకి అనుమతించకపోవడం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు