బీజేపీ నేత దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు

29 May, 2016 20:31 IST|Sakshi

కోల్ కతా: రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ లీడర్లను వాళ్ల ఇళ్లలోనే చావగొట్టి వట్టి చేతులతోనే తల నరుకుతానని తీవ్ర వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ కేడర్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిపై ఏర్పాటుచేసిన మీటింగ్ లో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు ఆయన నియోజకవర్గం ఖరగ్ పూర్ సర్దార్ లో ఓట్లు వేసిన వారిపై థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తానని అన్నారు. ఖరగ్ పూర్ లో తనకు 8 వేల మంది కార్యకర్తలున్నారనీ నియోజవర్గం నుంచి మొత్తం 34 వేల ఓట్లు తృణమూల్ కు పోలయ్యాయని తెలిపారు. ఈ క్షణం మేం వారందరనీ ఉతికి ఆరేస్తే అడగడానికి వాళ్ల తల్లిదండ్రులు కూడా రారని అన్నారు.

దిలీప్ సంఘ్ పరివార్ పేరును వాడుతూ ఇచ్చిన స్పీచ్ వీడియో ఇప్పుడు ఇంటర్నట్ లో హల్ చల్ చేస్తోంది. తమపై దాడులు జరిగితే సహించబోమని ప్రత్యర్ధులకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. మాలో సగం మందిని ఆర్ఎస్ఎస్ తయారుచేసిందనీ మేం దేనికైనా తెగిస్తామని అన్నారు. మేం గెలిచింది మూడు సీట్లు మాత్రమే కానీ ఆ బలం చాలు మాకు తృణమూల్ కు తగిన బుద్ధి చెప్పడానికి అని విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్తే తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర పరిణామాలను చూస్తారని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు