ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!

30 Nov, 2015 19:10 IST|Sakshi
ఆయనను బలవంతంగా బయటకు గెంటేశారు!

న్యూఢిల్లీ: అధికార ఆప్‌ ఎమ్మెల్యే అల్కా లాంబాపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన అభ్యంతరకరవ్యాఖ్యల వివాదం సోమవారం కూడా ఢిల్లీ అసెంబ్లీని కుదిపేసింది. ఈ విషయమై ఆప్‌ మహిళా ఎమ్మెల్యేలతో బీజేపీ సభ్యుడు విజేందర్‌ గుప్తా తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇది సభలో తీవ్ర రచ్చ సృష్టించడంతో ఆయనను మార్షల్ బలవంతంగా ఎత్తుకొని.. బటయకు తీసుకెళ్లారు. ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఢిల్లీ జన్‌లోక్‌పాల్‌ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఈ ఘటన జరిగింది.

గతవారం ఓపీ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆప్‌ ఎమ్మెల్యేలతో విజేందర్ గుప్తా వాగ్వాదానికి దిగడంతో ఆయనను 4 గంటలవరకు అసెంబ్లీ లోపలికి రావొద్దని స్పీకర్ రామ్‌నివాస్ గోయల్‌ ఆదేశించారు. దీంతో స్పీకర్ తీరును తప్పుబట్టిన గుప్తా సభ నుంచి బయటకు వెళ్లనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో మార్షల్స్ సభలోకి వచ్చి ఆయనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గుప్తా ఎంతకూ వెనక్కితగ్గకపోవడంతో మార్షల్స్‌ బలవంతంగా ఎత్తుకొని.. సభ బయటకు తీసుకుపోయారు.

మరిన్ని వార్తలు