సూరత్ : వలస కార్మికుల నుంచి అన్యాయంగా డబ్బులు దండుకోవటమే కాకుండా.. ఇదేంటని అడిగిన ఓ వలస కార్మికున్ని విచక్షణా రహితంగా చితకబాదాడో బీజేపీ నేత. ఈ సంఘటన గుజరాత్లోని సూరత్లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకుపోయారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా వీరిని సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. రైలు టిక్కెట్ తీసుకునే అవకాశం లేకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. కానీ, సూరత్కు చెందిన రాజేష్ వర్మ అనే బీజేపీ నేత వలస కార్మికుల నుంచి టిక్కెట్ల ధరల రూపంలో దాదాపు రూ.లక్ష వసూలు చేశాడు. ఒక్కోటిక్కెట్ ధరకు మూడురెట్లు అధికంగా డబ్బులు వసూలు చేశాడు. ( భారత్ ప్రతీకార దాడి: పాక్ సైనికులు హతం )
వాసుదేవ వర్మ అనే వలస కూలీ టిక్కెట్ల ధరల విషయమై అతడ్ని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్, అతడి అనుచరులు వాసుదేవను చెక్క దబ్బలతో, రాళ్లతో చావగొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరల్ పాటెల్ అనే కాంగ్రెస్ నాయకుడు దీన్ని తన ట్విటర్ ఖాతో పోస్ట్ చేశాడు. కాగా, దాడికి పాల్పడ్డ రాజేష్ వర్మకి బీజేపీతో అసలు సంబంధమే లేదని అధికార బీజేపీ పార్టీ చెబుతుండటం గమనార్హం. ( లాక్డౌన్ :ప్రియుడిని కలవటం కుదరక భర్తను.. )