సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్ ఓటమితో కంగుతిన్న కాషాయపార్టీకి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో అసమ్మతి స్వరాలు చికాకు కలిగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన షజియా ఇల్మి పార్టీ సీనియర్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఢిల్లీ నేతలు వివక్ష, పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ బీజేపీ నేతల తీరుతోనే తనకు అభ్యంతరాలున్నాయని..పార్టీ సీనియర్నేతలు ఈ విషయంపై ఆలోచించాలని..బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని పరిశీలించాలని ఆమె వ్యాఖ్యానించారు. అయినా ఇప్పుడు అంతా కుదురుకుందని..తాను సంతృప్తిగా ఉన్నానని షజియా చెప్పుకొచ్చారు. ఢిల్లీ బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం ఇదే తొలిసారి కాదు. గత కొంతకాలంగా పార్టీ నేతల వైఖరి పట్ల ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షురాలు షజియా ఇల్మీ మండిపడుతున్నారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన వేదికపైకి షజియాను అనుమతించకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఢిల్లీ నేతలందరికీ ప్రధాన వేదిక వద్దకు అనుమతిస్తూ పాస్లు ఇవ్వగా, షజియా మాత్రం మీడియా ఎన్క్లోజర్ వద్ద కూర్చుండిపోయారు.