బీజేపీ ఖాతాలోకే.. రెండు రాష్ట్రాలు?!

25 Oct, 2017 10:08 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాలకు ఇది నిజంగా శుభవార్తే. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై సొంత పార్టీ నేతలే దారుణ విమర్శలు, మోదీ పతనం మొదలైందంటూ వస్తున్న పత్రికా కథనాలతో కమలం కల్లోలంగా ఉన్న సమయం ఇది. సరిగ్గా ఇప్పడు వచ్చి పడ్డ హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో కమలనాథులకు కష్టకాలం అంటున్న సమయంలో.. రెండు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకి వెళతాయని.. ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా ఒపీనియన్‌ పోల్‌ సర్వే ప్రకటించింది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకన్నా ఎక్కువగానే సీట్లు వస్తామని సర్వే తెలిపింది.

సర్వే ముఖ్యాంశాలు

  • హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఈ దఫా షాక్‌ తగలనుంది. ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాక మూండింట రెండొంతల మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయి.
  •  పోల్‌ సర్వే అంచనాల ప్రకారం బీజేపీ 43-47 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 21-25 సీట్లు సాధించవచ్చు. హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ సభ్యుల సంఖ్య 68.
  • గుజరాత్‌లో బీజేపీ వరుసగా అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువని సర్వే తెలిపింది. ఇక్కడ బీజేపీకి 115 నుంచి 125 సీట్లు లభించే అవకాశాలున్నాయి. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి.
  • గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ గతంలో కంటే తన సీట్ల సంఖ్యను ఈ దఫా పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 57 నుంచి 65 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
  • గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది.
  • ముఖ్యమంత్రిగా విజయ్‌ రూపానీ వైపే 34 శాతం మంది గుజరాతీయులు మొగ్గు చూపడం విశేషం.
  • ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గుజరాత్‌కు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తున్నారని 66 శాతం మంది ప్రజలు నమ్ముతున్నారు.
  • ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఆర్థిక సంస్కరణలు బాగా లేవని మెజారిటీ గుజరాతీయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
  • జీఎస్టీ పట్ల 51 శాతం మంది గుజరాతీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 53 శాతం మంది ప్రజలు పెద్ద నోట్ల రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు