మహిళా ఎమ్మెల్యే భర్త వీరంగం!

21 Feb, 2017 10:35 IST|Sakshi
మహిళా ఎమ్మెల్యే భర్త వీరంగం!

జైపూర్: చలానా రాశాడన్న కారణంగా బీజేపీ ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై దుర్భాషలాడుతూ.. దాడిచేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషనల్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్ హెచ్ఓ రామ్ బసైదా కథనం ప్రకారం..  బీజేపీ కార్యకర్త వెళ్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేసి, డాక్యుమెంట్లు లేని కారణంగా చలానా రాశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్, భర్త నరేంద్ర మేఘవాల్ తో కలిసి అక్కడికి వెళ్లారు. ఇద్దరు కలిసి డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు.

మర్యాదగా తమ పార్టీ వ్యక్తిని వదిలిపెట్టాలని, చలానా ఎందుకు రాశారని.. డబ్బు చెల్లించే ప్రసక్తే లేదంటూ గొడవకు దిగి ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. డీఎస్పీ కునారమ్ జాత్ సీనియర్ పోలీసులతో జరిగిన వివాదంపై చర్చించనట్లు సమాచారం. ఎంపీ ఓ.ఎమ్.బిర్లా, ఇతర బీజేపీ నేతలు గొడవ సద్దుమణిగేలా చేయాలని, కేసు లాంటివి లేకుండా రాజీ కుదర్చాలని యత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు. డ్యూటీలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే భర్త నరేంద్ర మేఘవాల్ ను అరెస్ట్ చేయలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.