ఉన్నావ్‌ కేసు : ఎమ్మెల్యే గూండాలు బెదిరిస్తున్నారు

15 Apr, 2018 12:29 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌

సాక్షి, లక్నో : ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి బంధువులు, గ్రామస్తులకు బెదిరింపులు తీవ్రతరమయ్యాయని బాధితురాలి బాబాయి ఆందోళన వ్యక్తం చేశారు. సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి నోరు మెదపవద్దని గ్రామస్తులను బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ అనుచర గూండాలు బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. కొందరు గూండాలు నిన్న (శనివారం) రెండు కార్లలో గ్రామానికి వెళ్లి స్ధానికులను బెదిరించారని, ఘటనపై నోరు మెదపవద్దని లేదా గ్రామాన్ని విడిచివెళ్లాలని హెచ్చరించారని అన్నారు.

గూండాల బెదిరింపుల నేపథ్యంలో ఇద్దరు గ్రామస్థులు కనిపించడం లేదని తెలిపారు. సామూహిక లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సెంగార్‌ను ఏడు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో బాధితురాలి బాబాయి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతకుముందు ఎమ్మెల్యే సెంగార్‌ను అరెస్ట్‌ చేయకపోవడం పట్ల అలహాబాద్‌ హైకోర్టు యూపీ పోలీసులను తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల యంత్రాంగం, పోలీసు అధికారులు ఎమ్మెల్యే చెప్పుచేతల్లో వ్యవహరించడం ఆందోళనకరమని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ భోసలే, జస్టిస్‌ సునీత్‌ కుమార్‌లతో కూడిన బెంచ్‌ వ్యాఖ్యానించింది. 

>
మరిన్ని వార్తలు