బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

7 Jun, 2018 19:14 IST|Sakshi
బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాల్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, బెంగళూరు: బీజేపీ నేతల దుందుడుకు వ్యాఖ్యలకు బ్రేక్‌ పడటం లేదు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేసిన హిందువుల కోసం మాత్రమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని కార్పొరేటర్లకు సూచించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కార్పొరేటర్లను కలిసిన తాను వారందరూ తనకు ఓటువేసిన హిందువుల కోసం పనిచేయాలని, ముస్లింలకు కాదని తాను విస్పష్టంగా చెప్పానని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే చెప్పడం కనిపించింది.

హిందువుల కోసమే పని చేయాలంటూ అక్కడ చేరిన వారు గట్టిగా బదులివ్వడం కనిపించింది. టోపీ, బుర్ఖాలు ధరించి వచ్చే వారిని అనుమతించరాదని, తన కార్యాలయంలో, తన పక్కన వారిని అనుమతించరాదని సిబ్బందికి చెప్పానన్నారు. జూన్‌ 4న విజయపురలో జరిగిన ఓ కార్యక్రమంలో పాటిల్‌ యత్నాల్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. యత్నాల్‌ గతంలో ఎంపీగా, వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు