‘నా ఫ్యామిలీ వేధింపులకు గురవుతోంది’

12 Jul, 2019 20:49 IST|Sakshi
సాక్షి మిశ్రా

లక్నో : తన తండ్రి నుంచి తనకు, తన భర్త అజితేశ్‌ కుమార్‌కు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా తమను విడిచిపెట్టమని మరోసారి తన తండ్రిని అభ్యర్థించింది. శుక్రవారం ఆజ్‌తక్‌ చానెల్‌ నిర్వహించిన లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి అక్కడి నుంచే తనను క్షమించాలంటూ తండ్రిని  వేడుకుంది. 

తమను తన తండ్రి నుంచి రక్షించాలంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్త చర్చ జరగడంతో ఆజ్‌తక్‌ చానెల్‌ లైవ్‌ డిబేట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమం నుంచే తన తండ్రి, ఉత్తరప్రదేశ్‌లోని భిథారి చేన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రాకి ఫోన్‌ చేసిన సాక్షి ఇక నుంచి తనకు ప్రశాంతమైన జీవితం ప్రసాదించమని కోరింది.  ‘నాకు చదువుకోవాలని, ఉన్నత స్థానం చేరుకోవాలని చాలా ఉండేది నాన్న. నీతో పాటు నేను బయటకు వస్తానని ఎన్నిసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చేసిన పనిపై మీ ఆలోచనను మార్చుకోండి, నన్ను ప్రశాంతంగా జీవించేలా చూడండి, మా వెంట పడొద్దు’ అంటూ టీవీ షో నుంచే అభ్యర్థించింది.

‘మా నాన్న నన్ను ఇంటి నుంచి బయటకు రానిచ్చేవాడు కాదు. మా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకొనేవాడు కాదు. మా అమ్మ, సోదరుడు నన్ను నిత్యం వేధించేవార’ని కన్నీటి పర్యంతమైంది. స్పందించిన రాజేష్‌ మిశ్రా, తన ఫ్యామిలీ ఇప్పుడు వేధింపులకు గురి అవుతోందని వాపోయాడు. ఈ సందర్భంగా సాక్షి తన తండ్రిని క్షమాపణలు కోరింది. నువ్వు కోరుకున్న జీవితమే గడపమంటూ రాజేష్‌ మిశ్రా కాల్‌ను వెంటనే కట్‌ చేశాడు. (చదవండి: ఏజ్‌ గ్యాప్‌, ఇన్‌కం కారణంగానే..)

మరిన్ని వార్తలు