గాంధీజీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

2 Feb, 2020 08:58 IST|Sakshi

బనశంకరి : వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే శనివారం మహాత్మాగాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సత్యాగ్రహం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, ఇలాంటి వ్యక్తి దేశానికి మహా పురుషుడా..? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనంతకుమార్‌ హెగ్డే మాట్లాడుతూ.. ఎవరు దేశం కోసం ఆయుధాలు పట్టుకుని పోరాటం చేశారో వారందరూ ఉరికి వేలాడారని, ఎవరు తమ సిద్ధాంతాలు, వాదనలతో దేశ నిర్మాణం కోసం ప్రయత్నించారో వారందరూ చీకటి గదుల్లో మగ్గిపోయారని అన్నారు.

ఎవరు బ్రిటీషు వారితో ఒప్పందం కుదుర్చుకుని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారని సర్టిఫికెట్‌ తీసుకున్నారో వారందరూ నేటి చరిత్ర పుటల్లో విరాజిల్లుతున్నారని చెప్పారు. ఇదంతా దేశం చేసుకున్న దైర్భాగ్యం అంటూ గాంధీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో మూడు వర్గాలు ఉండేవని, ఒకరు విప్లవకారులు, మరొకరు ఆయుధాలు పట్టుకున్నవారు, మరో వర్గం ప్రముఖ జాతీయవాదులని తెలిపారు. బెంగుళూరు హిందుత్వ రాజధాని కావాలని, ప్రపంచాన్ని హిందుత్వంగా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 

మరిన్ని వార్తలు