ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌

11 Jun, 2019 14:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్‌ వ్యవహరించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వీరేంద్ర కుమార్‌ పేరును ఖరారు చేసిందని, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. వీరేంద్రకుమార్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల17 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలతో ప్రమాణ స్వీకారంతో పాటు ఈ నెల 19న జరిగే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను కూడా ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. వీరేంద్ర కుమార్‌ ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.  మధ్యప్రదేశ్‌ తికమార్ఘ్‌ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు.

వీరేంద్ర కుమార్‌ దళిత కులానికి చెందిన నాయకుడు. ఏబీవీపీ కార్యకర్తగా వీరేంద్ర రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1977-79 మధ్య కాలంలో ఏబీవీపీ కన్వినర్‌గా పని చేశారు. మోదీ ప్రభుత్వంలో 2014 -19 మధ్య కాలంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 1975లో జేపీ మూవ్‌మెంట్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, చైల్డ్‌ లేబర్‌ అంశంపై పీహెచ్‌డీ చేశారు.

మరిన్ని వార్తలు