రాహుల్‌పై బీజేపీ ఎంపీ ప్రశంసలు

20 Jan, 2019 12:02 IST|Sakshi

డెహ్రాడూన్‌ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై బీజేపీ మహిళా ఎంపీ సరోజ్‌ పాండే ప్రశంసలు కురిపించారు. రాహుల్‌లో ఇటీవల కొంత పరిణితి కనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.చత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అయిన పాండే గతంలో రాహుల్‌కు మందబుద్ధి ఉందని పేర్కొనడం గమనార్హం. రాహుల్‌ ఇటీవలి రాజకీయ ఎత్తుగడలను ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు

. కాగా గతంలో వ్యాపం స్కాంను రాజకీయ వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌ భుజాలకెత్తుకుందని, ఇది సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో విపక్షాలు రాఫేల్‌ స్కాంను తెరపైకి తెచ్చాయని సరోజ్‌ పాండే ఆరోపించారు. ఇక కోల్‌కతాలో విపక్షాల ఐక్యతా ర్యాలీపై ఆమె విమర్శలు గుప్పించారు. తన సొంత రాష్ట్రం బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని మమతా బెనర్జీ విపక్షాల ర్యాలీకి నేతృత్వం వహించడం విస్మయం కలిగిస్తోందన్నారు. బెంగాల్‌లో విపక్షాలను అణిచివేస్తున్న మమతా సమక్షంలో విపక్షాలన్నీ మోదీపై పోరాడతామని ప్రకటించడం అవివేకమని ఎద్దేవా చేశారు. బీజేపీ సత్తా ఏపాటిదో ఈ నేతలను చూస్తే అర్ధమవుతుందన్నారు.

మరిన్ని వార్తలు