#మీటూ : ‘మగాడి జీవితాన్ని నాశనం చేస్తోంది’

9 Oct, 2018 13:55 IST|Sakshi
బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న #మీటూ ఉద్యమం గురించి అధికార బీజేపీ పార్టీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఉద్యమం వల్ల చాలా మంది పురుషుల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఉదిత్‌ రాజ్‌ మీటూ ఉద్యమం గురించి స్పందిస్తూ.. ‘అవును లైంగిక వేధింపులు జరిగాయనే విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఇది మగవాని స్వభావం. మరి మహిళలు సరిగ్గానే ఉన్నారా..? ఈ ఉద్యమాన్ని వారు తప్పుగా వాడుకోవడం లేదా..? దీన్ని అడ్డం పట్టుకుని వారు ఒక్కో పురుషుని దగ్గర నుంచి 2 - 4 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలా డబ్బు చేతికి రాగానే మరో మగవాడి మీద పడుతున్నారు. ఈ ఉద్యమం పురుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే ఎంపీ వ్యాఖ్యల పట్ల జనాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేవలం స్త్రీలకు జరిగిన అన్యాయాల గురించే కాదు.. పురుషులు ఎదుర్కొన్న వేధింపుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి దరిద్రాలు జరగకుండా చూడాల్సిన నాయకులే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు