బీజేపీ పాలనలో 51 శాతం జనాభా! 

17 Dec, 2018 01:19 IST|Sakshi

మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఇప్పుడు (2018 డిసెంబర్‌) దేశంలో కాషాయపక్షం పాలనలోని జనాభా సంఖ్య 63 కోట్ల 40 లక్షలకు (51 శాతం) పడిపోయింది. 2017లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేశ జనసంఖ్యలో 71 శాతం (దాదా పు 88 కోట్ల 80 లక్షలు) ఉన్నట్టు అంచనా. తాజా ఎన్నికల ఫలితాలతో బీజేపీ పాలనలోని జనాభా సంఖ్య 25 కోట్ల 40 లక్షలు తగ్గిపోయింది. ప్రస్తుతం బీజేపీ ప్రత్యక్ష పాలనలో లేదా భాగస్వామిగా ఉన్న సంకీర్ణాల పాలనలో 16 రాష్ట్రాలున్నాయి. 2014 మే 24న కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏడు రాష్ట్రాలు ఈ పార్టీ పాలనలో ఉనాయి. ఇప్పుడు వీటి సంఖ్య 16 రాష్ట్రాలకు (సంకీర్ణాలతో కలిపి) పెరిగింది.

ఈ రాష్ట్రాలు: అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, బిహార్, గోవా, గుజరాత్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకానొక దశలో బీజేపీ రాష్ట్రాల సంఖ్య 21 వరకూ ఉండేవి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 3 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్‌ లేదా సంకీర్ణ భాగస్వామిగా ఉన్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు (కర్ణాటక, పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌) పెరిగింది. 2017లో కాంగ్రెస్‌ పాలనలోని రెండు రాష్ట్రాల్లో 7% జనాభా ఉండగా, ఇప్పుడు రాష్ట్రాల సంఖ్యతోపాటు పాలనలోని జనాభా 21 శాతానికి పెరిగింది. మిజోరంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పో యిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, మిజోరం, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌. జమ్మూకశ్మీర్‌ ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉంది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 678 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ 305 సీట్లు, బీజేపీ 199 సీట్లు గెలుచుకున్నాయి. దేశ జనాభాలో ఆరో వంతు లేదా 15% ఈ రాష్ట్రాల్లో ఉంది.     – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

>
మరిన్ని వార్తలు