అవార్డు వాపసీపై బీజేపీ కౌంటర్ బుక్!

5 Nov, 2015 18:17 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతున్నదంటూ జాతీయ పురస్కారాలు వెనుకకు ఇచ్చేస్తున్న సినీ కళాకారులు, రచయితల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. దేశంలోని పరమత అసహనానికి నిరసనగా గురువారం 24మంది సినీ ప్రముఖులు, రచయితలు తమ అవార్డులు వాపస్ ఇచ్చారు. అవార్డులు వెనుకకు ఇచ్చేసిన వారిలో సయిద్ మిర్జా, కుందన్‌ షా, అరుంధతి రాయ్‌, విక్రాంత్ పవర్ వంటి ప్రముఖులు ఉన్నారు. మరోవైపు అవార్డులు వెనుకకు ఇచ్చేస్తున్న వారికి బీజేపీ కూడా దీటుగానే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది.

అవార్డు వాపసీ ధోరణిని తప్పుబడుతూ 'నో యువర్ ట్రస్ట్' (మీ విశ్వాసాన్ని తెలుసుకోండి) పేరిట ఆ పార్టీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ అభివృద్ధి అజెండాను పట్టాలు తప్పించేందుకే ఈ విధంగా కల్పితమైన నిరసనను సృష్టించారని మండిపడ్డారు. భావస్వేచ్ఛను హరించిన కాంగ్రెస్‌ పార్టీ గడిచిన 60 ఏళ్లలో తాను ఏ తప్పు చేయనట్టు నీతులు చెప్తున్నదని విమర్శించారు.
 

మరిన్ని వార్తలు