ఆగ్రాః ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా యూనిట్ బీజేపీ మీడియా ఇంచార్జ్ రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. దీనికి బోలడన్నీ లైకులు కూడా పడ్డాయట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు,నాయకులు, కొంతమంది హిందూ సంస్థల నేతలు ఎక్కువగా లైక్ చేశారట. దీంతో ఆగ్రాలోని రాజ్ కుమార్ పాతిక్ ను సస్పెండ్ చేసింది బీజేపీ.
కశ్మీర్ లో పీడీపీ కి మద్దతు ఇవ్వడం ద్వారా పాముకి పాలు పోసి పెంచుతున్నారనీ.. తొందర్లోనే ఈ పాము మోదీ ని కాటేసే అవకాశాలు న్నాయంటూ పాతిక్ రాసిన కవిత చాలా ఘాటుగానే ఉందని సమాచారం.
ఇది ఇలా ఉంటే పాతిక్ తన వాదనను సమర్థించు కుంటున్నారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని, స్వయంగా మోదీయే పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇది నా ఒక్కడి వాదన కాదు, వేర్పాటు వాద పార్టీతో కలవడం దేశ వ్యాప్తంగా విమర్శలకు గురౌతోందని పేర్కొన్నారు.