న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ప్రకటనతో కోడ్ అమల్లోకి వచ్చిన వెనువెంటనే రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్లడానికి నిరాకరించారని బీజేపీ పేర్కొంది. అదే విధంగా ప్రభుత్వ కారు, ఎస్కార్టు వాహనాలను కూడా ఆమె తిరస్కరించారని తెలిపింది. ఆదివారం ఓ కార్యక్రమం నిమిత్తం నిర్మలా సీతారామన్ చెన్నైకి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ప్రత్యేక విమానం ఎక్కనున్న ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో ఓ బీజేపీ నేత కారులో విమానాశ్రయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ తర్వాత దేశీయ విమానంలో ఢిల్లీకి వెళ్లారు.
కాగా లోక్సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.