మోదీ మాటలు ఎవరికి పాఠాలు !

31 Dec, 2018 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రతికూల అంశాలను ప్రచారం చేయడం చాలా సులువు. సానుకూల అంశాలను వైరల్‌ చేయడానికి మనమంతా చేతులు కలుపుదాం!’ అంటూ ఆ ఏడాదిలో చివరిదైన ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునివ్వడం సానుకూల అంశమే. ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ, ఆయన వ్యాఖ్యల స్ఫూర్తిని ముందుగా అర్థం చేసుకోవాల్సిందీ, పాటించాల్సిందీ ఆయన పార్టీ అయిన బీజేపీ నాయకులు, కార్యకర్తలే. ‘ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ తన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ చెంప పగులగొట్టాడు’ అనే నకిలీ వార్త వైరల్‌ అవడం, అది ఓ బీజేపీ సోషల్‌ మీడియా కార్యకర్తనే సృష్టించారనే విషయం తెల్సిందే.

ఈ విశయాన్ని ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన బీజేపీ సోషల్‌ మీడియా కార్యకర్తల సమావేశంలో నరేంద్ర మోదీకి కుడిభుజం, పార్టీ అధ్యక్షుడు అయిన అమిత్‌ షా స్వయంగా అంగీకరించారు. ఆయతే ఆ చర్యను ఆయన తీవ్రంగా ఖండించకపోగా పరోక్షంగా ప్రోత్సహించినట్లు మాట్లాడడం ఇక్కడ గమనార్హం.‘ఎవరైనా ఇలాంటివి చేయకూడదు. అయితే ఇక్కడతను ఓ దృక్పథంతో ఈ వార్తను సష్టించారు. ఇది చేయదగ్గ పనే. కానీ చేయకూడదు. మంచైనా, చెడైనా, నిజమైనా, అబద్ధమైన ఎలాంటి వార్తలనైనా ప్రజల్లోకి తీసుకెళ్లే సామర్థ్యం ఈ నాడు మనకుంది. ఇదంతా మన వాట్సాప్‌ గ్రూపుల్లో 32 లక్షల మంది ఉండటం వల్లనే సాధ్యమైంది. అందుకే ఈ వార్త కూడా వైరల్‌ అయింది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు.

నకిలీ వార్తలను సృష్టించడం, ప్రచారం చేయడమే కాదు, బీజేపీ నాయకులు ప్రతికూల వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఇటు అమిత్‌ షాగానీ, అటు మోదీగానీ ఎన్నడు ఖండించలేదు, కనీసం నోరుకూడా విప్పలేదు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మత హింసాకాండ జరుగుతోందంటూ ‘2002, గుజరాత్‌ అల్లర్ల’కు సంబంధించిన ఫొటోలను, నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లింలు’ అంటూ ఓ మరాఠీ సినిమా షూటింగ్‌ పోస్టర్‌తో బీజేపీ మీడియా సెల్‌ అధిపతి అమిత్‌ మాలవియా నకిలీ వార్తలను ప్రసారం చేసినా వీరు ఖండించలేదు. ఆయన ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. మూక హత్యలకు పాల్పడిన వారు జైలు నుంచి బెయిల్‌పై విడుదలయితే బీజేపీ నాయకులు ఎదురెళ్లి స్వాగతం చెప్పడం, అతిధి మర్యాదలతో సత్కరించడం మనకు తెల్సిందే.

యూపీలోని బులంద్‌షహర్‌లో ఆవులను చంపారనడాన్ని తీవ్రంగా ఖండించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రచారంతో అనంతరం జరిగిన హింసాకాండలో బజరంగ్‌ దళ్‌ నాయకుడు ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను కాల్చి చంపడాన్ని ఓ యాక్సిడెంట్‌ కింద వర్ణించడం, ఆ పోలీసు ఇన్‌స్పెక్టరే తనకు తాను కాల్చుకున్నాడని స్థానిక బీజేపీ వ్యాఖ్యానించడం, నేడు మనిషి ప్రాణంకన్నా ఓ ఆవు ప్రాణం ముఖ్యమైందన్న బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షాను టెర్రరిస్టు అనడం, కాల్చివేయాలనడం ప్రతికూల ప్రచారం కాదా? అంతెందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నా ఈ నాయకులు మౌనమే పాటించారు.ఇటీవల మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోవడం వల్ల నరేంద్ర మోదీ వైఖరిలో నిజంగానే మార్పు వచ్చి ఉండవచ్చు. అయితే ఆయన మాటల్లోని స్ఫూర్తిని ముందుగా అమిత్‌ షా, ఆదిత్యనాథ్‌ యోగి, అమిత్‌మాలవియా నుంచి బీజేపీ నాయకులంతా గ్రహించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు