బీజేపీ కార్యకర్తలందరూ ఆ పని చేయండి: మోదీ

6 Apr, 2020 11:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నిర్మాణంలో, అభివృద్దిలో విశేష కృషి చేసిన వారిని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేసుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే సుపరిపాలన, పేదల సంక్షేమం పైనే ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా బీజేపీ కార్యకర్తలు చాలా కృషి చేసి అనేకమంది జీవితాల్లో వెలుగులు నింపారని, సమాజ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వారి కృషి  కారణంగానే దేశవ్యాప్తంగా బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అని మోదీ పేర్కొన్నారు. 

అదేవిధంగా కొవిడ్‌-19తో భారత్‌ పోరాడుతున్న సమయంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం వచ్చిందని మోదీ అన్నారు. ‘పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన మార్గదర్శకాలను అనుసరిస్తూ అవసరంలో ఉన్న వారికి ఈ సందర్భంగా సహాయాన్ని అందించండి. అదేవిధంగా సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకతను అందరికి వివరించండి. భారత్‌ నుండి కరోనాను తరిమికొట్టండి’ అని మోదీ ట్వీట్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. ఇప్పటి వరకు భారత్‌లో 4200 కరోనా కేసులు నమోదు కాగా, 24గంటల్లోనే 500కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 12 లక్షలు దాటగా 70,000 మంది వరకు చనిపోయారు. (చదవండి: దీప యజ్ఞం సక్సెస్‌)

మరిన్ని వార్తలు