గురుదాస్‌పూర్‌లో సన్నీ డియోల్‌ నామినేషన్‌

29 Apr, 2019 12:43 IST|Sakshi

చండీగఢ్‌ : బాలీవుడ్‌ నటుడు, ఇటీవల బీజేపీలో చేరిన సన్నీ డియోల్‌ సోమవారం ఆ పార్టీ తరపున పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు సన్నీ డియోల్‌ పార్టీ నేతలు వెంటరాగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ప్రార్ధనలు చేశారు. దుర్గా మాత ఆలయంలోనూ ఆయన పూజలు చేశారు. సన్నీ డియోల్‌ ఈనెల 23న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ల సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని, మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉండాలన్నది తన కోరికని, మన యువతకు మోదీజీ వంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందని పార్టీలో చేరిన అనంతరం సన్నీ డియోల్‌ వ్యాఖ్యానించారు. తన తండ్రి ధర్మేంద్ర అటల్‌జీతో పనిచేసినట్టుగానే మోదీకి మద్దతుగా తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా గురుదాస్‌పూర్‌ నుంచి అంతకుముందు బీజేపీ తరపున వినోద్‌ ఖన్నా ప్రాతినిధ్యం వహించారు. వినోద్‌ ఖన్నా భార్య కవితా ఖన్నాకు బీజేపీ టికెట్‌ ఖాయమవగా, చివరినిమిషంలో సన్నీ డియోల్‌ అభ్యర్థిత్వానికి కాషాయ పార్టీ మొగ్గుచూపింది.

మరిన్ని వార్తలు