సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 303 స్ధానాలను గెలుచుకోవడంతో పలు రాష్ట్రాల్లో విపక్షాలు గల్లంతయ్యాయి. కాషాయ ప్రభంజనంతో ప్రధాన విపక్షం కాంగ్రెస్ కేవలం 51 స్ధానాలకే పరిమితమైంది. నరేంద్ర మోదీ సునామీతో పలు రాష్ట్రాల్లో అన్ని లోక్సభ స్ధానాలనూ బీజేపీ గెలుచుకోగా, మరికొన్ని రాష్ట్రాల్లో పోలయిన ఓట్లలో సగానికి పైగా బీజేపీ సొంతం చేసుకుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ అద్భుత ఫలితాలు రాబట్టింది. ఇక మధ్యప్రదేశ్లో బీజేపీ 58 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 34.50 శాతం ఓట్లు పోలయ్యాయి.
బీజేపీ రాజస్ధాన్లో 58.47 శాతం, చత్తీస్గఢ్లో 50.7 శాతం, అరుణాచల్ప్రదేశ్లో 58 శాతం, పంజాబ్లో 50 శాతం, గోవాలో 51 శాతం, గుజరాత్లో 62.21 శాతం, హర్యానాలో 58 శాతం, హిమాచల్ప్రదేశ్లో 69 శాతం, జార్ఖండ్లో 51 శాతం, కర్ణాటకలో 51.38 శాతం, ఢిల్లీలో 56 శాతం, ఉత్తరాఖండ్లో 61 శాతం, యూపీలో 49.56 శాతం మేర ఓట్లు రాబట్టింది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కలిపి 50 శాతం పైగా ఓట్లు సాధించాయి. ఇక ఈ రాష్ట్రాల్లో విపక్షాలు బీజేపీతో పోలిస్తే ఓట్ల శాతంతో కాషాయ దళానికి చాలా దూరంలో నిలిచాయి.