కోవిడ్-19 యోధుడిని బలిగొన్న వైరస్
ముంబై : కోవిడ్-19పై పోరులో చురుకుగా వ్యవహరించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్ (54) మహమ్మారి బారినపడి మరణించారు. మూడు రోజుల కిందట ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంటివద్దే దీక్షిత్ చికిత్స పొందుతున్నారు. ఇంతలోనే తీవ్ర అస్వస్ధతకు గురవడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్య బృందం ముంబైలోని మహీం ప్రాంతంలోని ఆయన ఇంటికి చేరుకునేలోగానే బీఎంసీ అధికారి మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారని వారు ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఎన్ఎస్సీఐ డోమ్, రేస్ కోర్స్ల్లో కోవిడ్-19 మౌలిక వసతుల ఏర్పాటులో దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. 1987లో ఆయన సబ్ ఇంజనీర్గా బీఎంసీలో చేరారు.