కలియుగాన్ని చూడాలంటే..

30 Jul, 2019 14:25 IST|Sakshi
రిచా చద్దా (ఫైల్‌)

ముంబై: కలియుగాన్ని చూడాలంటే ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని బాలీవుడ్‌ నటి రిచా చద్దా వ్యాఖ్యానించారు. యూపీలో చట్టం అన్నదే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చట్టప్రకారం నడిచే పాలన సాగడం లేదని మరోసారి రుజువైంది. మీరు కలియుగం​లో ఉన్నామన్న భావన కలగాలంటే యూపీకి వెళ్లండి. ఆక్సిజన్‌ లేక ఆస్పత్రుల్లో తనువు చాలిస్తున్న పసిపిల్లలు కనబడతారక్కడ. ట్రకుల కింద నలిగిపోయే అత్యాచార బాధితులు కూడా కనిపిస్తార’ని రిచా ట్వీట్‌ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేసినప్పటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. నటి స్వర భాస్కర్‌ కూడా బాధితురాలికి మద్దతుగా ట్వీట్‌ చేశారు.

మోదీ-యోగి పాలనలో అత్యాచార బాధితురాలికి ఎటువంటి న్యాయం జరిగిందో చెప్పడానికి ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి కారు ప్రమాదం అద్దం పడుతోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవిత కృష్ణన్‌ ట్వీట్‌ చేశారు. నంబరు ప్లేటుపై నల్లరంగు పులుముకుని రాంగ్‌ రూటులో వచ్చిన ట్రక్కు బాధితురాలి కారుని ఢీకొట్టి న్యాయాన్ని సమాధి చేసిందని వ్యాఖ్యానించారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా అని ప్రశ్నించారు. (చదవండి: ‘ఉన్నావ్‌’ రేప్‌ బాధితురాలికి యాక్సిడెంట్‌)

>
మరిన్ని వార్తలు