ఖైదీలకు కరోనా.. హైకోర్టు ఆగ్రహం

9 May, 2020 14:19 IST|Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభణపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోవిడ్‌ నివారణకు తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే సెంట్రల్‌ ముంబైలోని అర్థూర్‌ రోడ్‌ జైలులో ఖైదీలకు, అధికారులకు కరోనా సోకడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లో ఉన్న ఖైదీలకు ఆరోగ్యంగా జీవించడం ప్రాథమిక హక్కుఅని, ఇకపై ఖైదీలను వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వైరస్‌ సోకిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఆర్ధూర్‌ జైలులో 77 ఖైదీలకు, 27 మంది జైలు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. (స్లమ్స్‌లో వణుకు... ఇక్కడా ఇరుకు)

మరోవైపు రాష్ట్రంలోని పోలీసు, వైద్య సిబ్బందికి వైరస్‌ సోకడం పట్ల హైకోర్టు ఆరా తీసింది. కోవిడ్‌పై పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని తెలిపింది. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా ఎంతకీ అదుపులోకి రావడంలేదు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,063 చేరగా.. వైరస్‌ కారణంగా 737 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఆసియాలోనే అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన నగరంలోని ధారవిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ధారవిలో శుక్రవారం 25 తాజా కేసులు వెలుగుచూడటంతో ఈ ప్రాంతంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 808కి ఎగబాకింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు