సల్మాన్ పిటిషన్పై వాదనలు వాయిదా

15 Jun, 2015 13:02 IST|Sakshi
సల్మాన్ పిటిషన్పై వాదనలు వాయిదా

ముంబై : హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన  బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్  అప్పీలుపై  వాదనలు  జూలై 1వ తేదీకి వాయిదా పడ్డాయి. ముంబై హైకోర్టు  సోమవారం ఈ మేరకు  ఆదేశాలు  జారీ చేసింది. 2002లో జరిగిన హిట్  అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ  సల్మాన్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

మద్యం సేవించి,  నిర్లక్ష్యంగా కారు నడిపి ముంబైలో ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసిన  హిట్ అండ్ రన్ కేసులో ముంబై  సెషన్స్ కోర్టు  సల్మాన్ ఖాన్ను దోషిగా  నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది.  అయిదేళ్ల జైలు  శిక్షను ఖరారు చేస్తూ  మే  6 వ తేదీన జస్టీస్ డీడబ్ల్యూ దేశ్ పాండే తుది తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరోవైపు   2002 నాటి సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ప్రభుత్వం నుంచి నియమితులైన న్యాయ సలహాదారులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర వివరాలను తెలుసుకునేందుకు దర్వేష్ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసుకున్న పిటిషన్  సందర్భంగా  సల్మాన్  కేసుకు  సంబంధించిన పేపర్లు కాలిపోయాయనే వార్తలు వివాదాన్ని రేపాయి.   జూన్ 21, 2012న సచివాలయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో సల్మాన్ కేసు పేపర్లు బూడిద అయిపోయాయని ఆర్టీఐ అధికారులు సమాధానం ఇచ్చారు.  దీంతో  ఆ కేసు నిష్పక్షిక విచారణపై అనేక  అనుమానాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు