మైనర్‌ గర్భం తొలగింపుకు హైకోర్టు అనుమతి

19 May, 2020 08:23 IST|Sakshi

ముంబై : అత్యాచారానికి గురైన ఓ మైనర్‌ బాలిక గర్భం తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. ప్రస్తుతం 24 వారాల గర్భిణిగా ఉన్న ఆ బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. అయితే తీర్పుకు ముందు గర్భం తొలగింపు బాలికపై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశంపై వైద్య నిపుణల సలహా తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. వైద్యం ద్వారా తన బిడ్డ గర్భం తొలగించుకోవడానికి తక్షణమే అనుమతి ఇవ్వాలని సదురు బాలిక తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ గర్భం దాల్చిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె మానసిక బాధలో ఉందని.. అందువల్ల గర్భం తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇది తన బిడ్డ చదువుపై శ్రద్ధ పెట్టడానికి సహాకరిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై మే 15న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గర్భం తొలగించడం ద్వారా బాలికకు ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యల ఎదురవుతాయా అనే దానిపై నివేదిక ఇవ్వడానికి జేజే హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణల బృందాన్ని ఏర్పాటు చేసింది. (చదవండి : ముంబైకు షాక్‌..‘బెస్ట్‌’ సర్వీసులు బంద్‌)

దీంతో అన్ని పరిశీలించిన వైద్య బృందం కోర్టుకు ఓ నివేదిక అందజేసింది. ‘24 వారాల్లో గర్భం తొలగించడం అనేది ఆ బాలికకు ప్రమాదం కలిగిస్తుంది. మరోవైపు గర్భం కొనసాగింపు ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి కలిగిస్తుంది. అందుకే ఆమె తనకు నచ్చిన హాస్పిటల్‌లో గర్భం తొలగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం’ అని పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన న్యాయస్థానం.. పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు బాలిక అబార్షన్‌కు అనుమతినిచ్చింది. 

మరిన్ని వార్తలు