శవాల ద్వారా కరోనా వ్యాప్తి చెందదు: హైకోర్టు

22 May, 2020 18:07 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ బాధితుల మృతదేహాలను పూడ్చేందుకు అవసరమైన శ్మశాన వాటికలను గుర్తించే అధికారం బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కు ఉందని ముంబై హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. శవాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారలు లేవని న్యాయస్థానం పేర్కొంది. కరోనా కారణంగా మరణించిన వ్యక్తుల మృతదేహాలను పూడ్చేందుకు 20 శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని ముంబై కార్పొరేషన్‌ ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు) 

అయితే బీఎంసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సబర్బన్‌ బాంత్రా నివాసి ప్రదీప్‌ గాంధీ ఏప్రిల్‌ 9న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారించిన చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్ఎస్ షిండేలతో కూడిన ధర్మాసనం కరోనా మృతదేహాల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేనందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. (డబ్ల్యూహెచ్‌ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్‌)

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రకటన చట్టానికి అనుగుణంగానే ఉందని, కరోనా రోగుల మృతదేహాలను పూడ్చేందుకు కావాల్సిన శ్మశానవాటికలను గుర్తించడానికి ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు అధికారం ఉందని కోర్టు తీర్పు వెల్లడించింది. కరోనా సోకిన మృతదేహాలను సురక్షితంగా పూడ్చేందుకు కార్పొరేషన్, ఇతర అధికారులు భారత ప్రభుత్వం అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. (పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు)

మరిన్ని వార్తలు