డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ సహాయ చర్యల్లో పాల్గొంటూ అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించిన 20మంది సైనికులకు డెహ్రాడూన్లో ఘనంగా సైనిక వందన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్కుమార్ షిండే, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి బహుగుణతో పాటు త్రివిధ దళాలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకు ముందు హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ సైనికులు ఉత్తరాఖండ్ బాధితులను రక్షించేందుకు సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని, జాతి కోసం కష్టపడ్డ సైనికుల కృషి మరవలేమని అన్నారు. గౌరీకుండ్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఎంఐ 17 హెలికాప్టర్ కూలి సైనికులు చనిపోయిన విషయం తెలిసిందే. మృతుల్లో వాయుసేన, పారామిలటరీ సిబ్బంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన వినాయకన్ కూడా అమరుడయ్యారు. మృతదేహాలను భారమైన హృదయాలతో వారి వారి స్వస్థలాలకు ప్రత్యేక వాహనాల్లో పంపించారు.