పెళ్లి కోసం యువతి ప్రమాదకర ప్రయాణం

11 Jul, 2018 09:13 IST|Sakshi

పట్నా : బిహార్‌కు చెందిన ఓ యువతి తన పెళ్లి కోసం ప్రమాదకరమైన ప్రయాణాన్ని కూడా లెక్కచేయలేదు. కతిహర్‌ జిల్లాలోని నిమా గ్రామానికి చెందిన సునీత తుడుకు జార్ఖండ్‌లోని మర్రో గ్రామానికి చెందిన మాన్వేల్‌ మరండితో జూలై 6వ తేదీన విహహం నిశ్చయమయింది. కానీ ఇరు రాష్ట్రాల మధ్య నడవాల్సిన పడవ సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో నదికి ఇరువైపుల ఉన్న గ్రామాల మధ్య రవాణా స్తంభించింది. వరుడి ఇంటికి వెళ్లాలంటే నది దాటక తప్పని పరిస్థితి. 8 రోజులకు మించి పడవ సర్వీసులు రద్దవ్వడం, గంగా నదిలో వరద తీవ్రత అధికంగా ఉండటంతో వరుడి కుటుంబం ఈ పరిస్థితుల్లో వధువు కుటుంబం నది దాటి రావడం ప్రమాదకరమని భావించింది. అయితే పెళ్లి వాయిదా వేయాల్సింది పోయి.. రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చింది.  దీంతో ఆందోళన చెందిన పెళ్లి కూతురు తన పెళ్లి ఆగిపోకూడదని నిర్ణయించుకుంది.

ఇదే విషయాన్ని తన కుటుంబసభ్యులకు వివరించింది. పడవ సర్వీసులు నిలిచిపోయినప్పటికీ.. ఓ పడవ తీసుకుని పెళ్లి కూతురు బంధువులంతా ప్రయాణానికి సిద్ధమయ్యారు. నదిలో వరద పోటు అధికంగా ఉన్న లెక్కచేయకుండా.. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా వారు పడవలో నది దాటి పెద్ద సాహసమే చేశారు. చివరకు వరుడి ఇంటికి చేరారు. దీంతో సునీత వివాహం అనుకున్న సమయానికి కంటే మూడు రోజులు ఆలస్యంగా జూలై 9వ తేదీన జరిగింది.

మరిన్ని వార్తలు