పెళ్లి జరిగిన రాత్రే షాకిచ్చిన వధువు

15 Dec, 2019 14:54 IST|Sakshi

లక్నో : లక్షల రూపాయలు ఖర్చపెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన అత్తింటికి భారీ షాకిచ్చింది ఓ నవ వధువు. పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే భారీ డబ్బు, నగలతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బడాన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంగఢ్‌కు చెందిన ప్రవీణ్‌‌, రియా డిసెంబర్‌ 9న వివాహం చేసుకున్నారు. టింకూ అనే మధ్యవర్తి ద్వారా ప్రవీణ్‌కు రియా పరిచయం అయింది. రియా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అని, పెళ్లి చేసే స్థోమత లేదని ప్రవీణ్‌ దగ్గర టింకూ రూ.4లక్షలు తీసుకున్నాడు.

పెళ్లి వధువు ఊరైన అజంగఢ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత అంతా కలిసి వరుడు ప్రవీణ్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి రియా.. ప్రవీణ్ కుటుంబం మొత్తానికి మత్తుమందు ఇచ్చి ఇంట్లో ఉన్న నగదు, నగలతో పారిపోయింది. ప్రవీణ్ కుటుంబం మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి వధువు రియాతో పాటు నగదు మరియు విలువైన వస్తువులు కూడా కనిపించలేదు. దాంతో కంగుతిన్న ప్రవీణ్ కుటుంబం.. అజంగఢ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త పెళ్లి కూతురు రూ .70 వేల నగదు, రూ.నాలుగు లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మధ్యవర్తిత్వం వహించిన టింకూ కూడా కనిపించకుండా పోయాడని తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, రియా తన కుటుంబ సభ్యుల పరువు తీసిందని, ఆమెను ఎలాగైనా అరెస్ట్‌ చేసి శిక్షించాలని ప్రవీణ్‌ కోరారు.

మరిన్ని వార్తలు