అతడిని రెండోసారి పెళ్లి చేసుకోలేక..

9 Dec, 2019 15:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో : పెళ్లి బరాత్ ఆలస్యమైన నేపథ్యంలో ఘర్షణ తలెత్తి ఓ వధువు కుటుంబ సభ్యులు ఆమెను మరొక యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో భంగపడిన వరుడు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలు.. బిజ్నూర్‌లోని నంగల్‌జాట్‌ గ్రామానికి చెందిన ఓ యువతికి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా అక్టోబరులో ఓ యువకుడితో పెళ్లి జరిగింది. అయితే డిసెంబరు 4న మరోసారి ఈ జంటకు శాస్త్రోక్తంగా పెళ్లి చేయాలని ఇరువర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో ధంపూర్‌ పట్టణానికి చెందిన వరుడు బిజ్నూర్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉండగా... రాత్రి వరకు అతడు రాకపోవడంతో వధువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కట్నం విషయమై కూడా గొడవ జరిగింది. దీంతో వధువు బంధువులు వరుడి తరఫు వాళ్లను ఓ గదిలో బంధించి తాళం వేశారు. వాళ్ల నుంచి విలువైన వస్తువులు లాక్కొని.. దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాళ్లను విడిపించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పోలీసుల సమక్షంలో రాజీకి వచ్చాయి. అయితే వధువు మాత్రం వరుడిని మరోసారి పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించిన గ్రామ పెద్దలు వధువు కోరుకున్న యువకుడితో పెళ్లి జరిపించారు.   

మరిన్ని వార్తలు