‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’

16 Jul, 2020 12:55 IST|Sakshi

పట్నా: గత నాలుగు రోజులుగా బిహార్‌లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద తాకిడికి ఓ వంతెన కొట్టుకుపోయింది. దీనిలో పెద్ద విశేషం ఏం ఉంది అనుకుంటున్నారా. ఉంది.. ఏంటంటే ఈ వంతెన ప్రారంభమయ్యి సరిగా నెల రోజులు కూడా కాలేదు. నేటికి కేవలం 29 రోజులు మాత్రమే. ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గండక్‌ నదిపై బ్రిడ్జిని నిర్మించారు. స్వయంగా ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఈ వంతెనను ప్రారంభించారు. ఇది జరిగిన 29 రోజులకే గోపాల్‌గంజ్‌లోని సత్తర్‌ఘాట్‌ ప్రాంతంలో వంతెనలో కొంత భాగం నదిలో కూలిపోయింది. దీని గురించి అధికారులను ప్రశ్నించగా.. ‘వంతెనను.. రహదారిని అనుసంధానిస్తూ నిర్మించిన కల్వర్టులు పెరుగుతున్న నీటి మట్టాన్ని తట్టుకోలేకపోయాయి. దాంతో వంతెన కూలిపోయింది’ అని సెలవిచ్చారు. (‘నరకం కంటే దారుణంగా ఉన్నాయి’)

ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌.. ‘రూ. 263 కోట్లు ఖర్చు చేసి.. ఎనిమిదేళ్లు కష్టపడి నిర్మించిన బ్రిడ్జి కేవలం 29 రోజుల్లో కూలిపోయింది. ఈ అవినీతి గురించి భీష్మా పితామహుడు వంటి నితీష్‌ జీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బిహార్‌లో ప్రతి చోటా ఇలాంటి దోపిడి ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు. గోపాల్‌గంజ్, తూర్పు చంపారన్ జిల్లాలను కలిపే సత్తర్‌ఘాట్ వంతెన పొడవు 1.4 కి.మీ. దీనిని జూన్ 16న ప్రజల రవాణా కోసం సీఎం ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణాన్ని ఎనిమిదేళ్ల క్రితం బీహార్ రాజ్య పుల్ నిర్మన్ నిగం లిమిటెడ్ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు