‘సామాన్యుడి జీవితానికి విలువ ఉందనిపిస్తోంది’

2 Jun, 2020 15:43 IST|Sakshi

లక్నో: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. పలుచోట్ల హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ ఘటనపై చెలరేగే ఆందోళనలు ప్రపంచంలో సామాన్యుడి జీవితానికి విలువ ఉందని తేలియజేసున్నాయని అన్నారు. అయితే భారత రాజ్యాంగం కూడా సామాన్య ప్రజలకు చాలా హామీలు ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు వాటిని ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో దేశంలో వలస కూలీల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె తెలిపారు. భారత రాజ్యాంగం ప్రజలకు స్వాతంత్య్రం, భద్రత, ఆత్మగౌవరం వంటి హామీలను ఇచ్చిందని వాటిపై  ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. (ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడి మార్పు)

మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్ట్‌ చేసిన పోలీసులు.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై మోకాలుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికీ పోలీసు అధికారి మాత్రం కనికరం చూపకుండా ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచాడు. దీంతో ప్రాణం పోతుందంటూ గిలగిల కొట్టుకున్న జార్జ్‌ పోలీసు మోకాలి కిందనే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ఆగ్ర రాజ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది.

మరిన్ని వార్తలు