పార్లమెంట్‌లో ‘భూ’కంపం

25 Feb, 2015 03:00 IST|Sakshi
పార్లమెంట్‌లో ‘భూ’కంపం

లోక్‌సభలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం
వ్యతిరేకించిన విపక్షం; రైతు వ్యతిరేక బిల్లు అంటూ నినాదాలు
నిరసనగా వైఎస్సార్సీపీ సహా విపక్ష పార్టీల వాకౌట్
బిల్లుపై రాజ్యసభలోనూ వ్యక్తమైన వ్యతిరేకత; పార్టీలతో చర్చించాలన్న ఎస్పీ
భూసేకరణలో పాత విధానాన్ని అవలంబించే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందన్న జైట్లీ
 

న్యూఢిల్లీ: ఊహించినట్లే భూసేకరణ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. లోక్‌సభలో బిల్లు ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు.. కలసికట్టుగా వాకౌట్ చేశాయి. ఇది పేదలు, రైతుల వ్యతిరేక.. కార్పొరేట్ల అనుకూల బిల్లు అని, దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశాయి. మరోవైపు, రాజ్యసభకు బిల్లు చేరకముందే పెద్దల సభలో దీనిపై దుమారం రేగింది. బిల్లుపై అఖిలపక్ష భేటీ జరపాలన్న విపక్షాల డిమాండ్ గురించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని సభానాయకుడు, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చిన అనంతరం సభా కార్యక్రమాలు కొనసాగాయి.

ఎన్డీయే మిత్రపక్షం సైతం.. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సంబంధిత ఆర్డినెన్సు స్థానంలో వివాదాస్పద భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ‘న్యాయమైన పరి హార హక్కు, పారదర్శకతలతో కూడిన భూ సేకరణ పునరావాస(సవరణ) బిల్లు, 2015’ ను సభలో ప్రవేశపెట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ స్పీకర్ సుమిత్ర మహాజన్ అనుమతి కోరిన వెంటనే.. వైఎస్సార్సీపీ సహా విపక్షాలన్నీ ఒక్కసారిగా లేచి నిల్చు ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత తెలిపాయి. ఆ బిల్లు పేదలు, రైతులకు అన్యాయం చేసేలా ఉందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, ఆప్, వామపక్షాలు, టీఎంసీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎన్డీయే మిత్రపక్షం స్వాభిమాని షేట్కారీ సంఘటన్ పార్టీ ఎంపీ రాజు శెట్టీ సైతం బిల్లును వ్యతిరేకిస్తూ, విపక్షాలతో జతకలవడం విశేషం. బిల్లులోని అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ.. విపక్ష సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విఫలయత్నంచేశారు. మొదట టీఎంసీ సభ్యుడు సౌగత్‌రాయ్ మాట్లాడుతూ.. ‘ఒక్క కలం పోటుతో రైతులు, నిరుపేదల పక్షాన ఉన్న నిబంధనలను తొలగించి వేశారు. సామాజిక ప్రభావానికి సంబంధించిన నిబంధనలను, రైతుల సమ్మతికి సంబంధించిన భాగాలను తొలగించివేశారు. అలాగే ఆహార భద్రత అంశాన్ని విస్మరించారు. ఈబిల్లును తేవడమంటే రైతులకు అంతిమ ఘడియలను తెచ్చినట్టే’ అన్నారు. ‘ఆర్డినెన్సును తీసుకురావడానికి బదులు, అన్ని పార్టీలను సంప్రదించి ముందుకు వెళ్లి ఉంటే.. అది వేరే సంగతి. కానీ ప్రభుత్వం ఆర్డినెన్సును తీసుకువచ్చి మొండి గా ముందుకెళ్లింది’ అని కాంగ్రెస్ నేత మల్లికార్జున్‌ఖర్గే వ్యాఖ్యానించారు. బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ టీఎం సీ.. బిల్లులోని కొన్ని కీలకాంశాలపై తమకు అభ్యంతరాలున్నాయంటూ బీజేడీ పేర్కొన్నాయి.

ఈ సమయంలో తనకు మాట్లాడే అవకాశమివ్వాలన్న టీఆర్‌ఎస్ నేత బి.వినోద్‌కుమార్ విజ్ఞప్తిని స్పీకర్ తోసిపుచ్చారు. అయినప్పటికీ వినోద్ మాట్లాడుతూ ‘ప్రధానమంత్రి సమాఖ్య స్ఫూర్తి అంటున్నారు. కానీ ఈ బిల్లు తెచ్చేముందు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనేలేదు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒకసారి మాట్లాడండి. మాది కొత్త రాష్ట్రమైనప్పటికీ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే మేం భూసేకరణకు సంబంధించి చట్టం తెచ్చాం. రైతుల మన్ననలు పొందాం. అందువల్ల అందరినీ సంప్రదించడం మంచిది’ అని పేర్కొన్నారు. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతించగానే.. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వి.వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, వై.ఎస్. అవినాశ్‌రెడ్డి సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారని ప్రతిపక్షాలపై వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. మెజారిటీకి మైనారిటీ ఆజ్ఞలు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. యూపీఏ హయాంలో భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే అభ్యర్థించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 32 ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సవరించాలంటూ విజ్ఞాపనలు చేశాయన్నారు. కాగా, గనులు, ఖనిజాల చట్టం సవరణకు ఉద్దేశించిన బిల్లును బీజేడీ సభ్యుల నిరసనల మధ్య ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్సును గత నెలలో ప్రభుత్వం జారీ చేసింది.

ప్రతిపక్షాలను సంప్రదిస్తాం: భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా రాజ్యసభలోనూ విపక్షాలు ఒక్కతాటిపై నిలిచాయి. ఆర్డినెన్సులోని అంశాలు రైతులకు అన్యాయం చేసి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, లెఫ్ట్, బీఎస్పీ, జేడీయూలు ధ్వజమెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, అదే సమయంలో రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఒక పరిష్కార మార్గాన్ని వెతికేందుకు అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ సూచించారు. ఆర్డినెన్సు ద్వారా కాకుండా విపక్షపార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే బావుండేదన్నారు. అనంతరం సభానాయకుడు అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. సరైన స్ఫూర్తితో ఎస్పీ నేత మాట్లాడారని, ఆయన సూచనను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలను సంప్రదిస్తానన్న జైట్లీ వ్యాఖ్యను స్వాగతిస్తున్నామని, అదే సమయంలో సంప్రదింపులు పూర్తయ్యేంతవరకు ఆర్డినెన్సును సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ చేసిన డిమాండ్‌కు.. అది కుదరదనే అర్థం వచ్చేలా జైట్లీ చేయి అడ్డంగా ఊపడం కనిపించింది. బీజేపీ సహా అన్ని పార్టీలు ఆమోదించి, చట్టంగా రూపొందిన బిల్లుకు సవరణలు చేస్తూ.. పార్లమెంటును తోసిరాజని ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్సును తీసుకువచ్చిందన్న కాంగ్రెస్ విమర్శలపై జైట్లీ స్పందిస్తూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 639 ఆర్డినెన్సులు వచ్చాయని, అందులో 80% కాంగ్రెస్ పాలనలోనే వచ్చాయని గుర్తుచేశారు. పార్లమెంటును కాదని చట్టాలు చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. భూసేకరణ ఆర్డినెన్సు స్థానంలో రూపొం దించిన బిల్లు ప్రస్తుతం లోక్‌సభలో ఉందని, అక్కడ ఆమోదం పొందిన అనంతరం రాజ్యసభకు వస్తుందన్నారు. బిల్లులో రైతుల పరిహారం 4 రెట్లు పెంచుతూ ప్రతిపాదనలున్నాయన్నారు. అయినప్పటికీ విపక్షాల విమర్శలు ఆగకపోవడంతో.. బిల్లు సభలోకి వచ్చాక విపక్షం అభ్యంతరాలు తెలప వచ్చన్నారు. ఈ భూ సేకరణ బిల్లు చట్టరూపం దాల్చినప్పటికీ.. పాత పద్ధ్దతే కొనసాగించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశముందని జైట్లీ వివరించారు. జవహర్‌లాల్ నెహ్రూ పాలనలోనే ఎక్కువ ఆర్డినెన్సులు వచ్చాయన్న జైట్లీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ స్పందిస్తూ.. దేశ విభజన అనంతర విపత్కర పరిస్థితుల్లో ఆ ఆర్డినెన్సులు వచ్చాయన్న విష యం గుర్తుంచుకోవాలన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టాన్ని కూడా మేం వ్యతిరేకించాం. కానీ, ఎన్డీఏ ఆర్డినెన్సును చూస్తుంటే వారు(యూపీఏ) దేవతల్లా కనిపిస్తున్నారు’ అని టీఎంసీ సభ్యుడు ఒబ్రెయిన్ అన్నారు.  

ఇరుకున పడ్డ ప్రభుత్వం: మూడు బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించేందుకు చేసిన ప్రయత్నం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. ఇన్సూరెన్స్ బిల్లు, బొగ్గు గనుల బిల్లు, మోటారు వాహనాల బిల్లులను రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుని, మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వ ఉద్దేశాన్ని విపక్షాలు ప్రశ్నించాయి. ఉపసంహరణ తీర్మానంపై చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. గత సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టామని, అనంతరం వాటికి సంబంధించిన ఆర్డినెన్సులను జారీ చేసినందున సభనుంచి వాటిని ఉపసంహరించాల్సి ఉందన్న జైట్లీ వివరణతో విపక్షం సంతృప్తి చెందకపోవటంతో తీర్మానాన్ని వాయిదా వేస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఆర్డినెన్సుల స్థానంలో తీసుకువచ్చిన బిల్లుల ఆమోదంలో విఫలమైన పక్షంలో బడ్జెట్ సమావేశాల అనంతరం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభలోమెజారిటీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో తగిన మద్దతు లేకపోవడంతో ఈ బిల్లుల ఆమోదం ప్రభుత్వానికి సమస్యగా మారింది.

>
మరిన్ని వార్తలు