డబ్బు కష్టాల్లోనూ నాలుగు ఫ్లాట్లకు రూ.119కోట్లు

12 Dec, 2016 14:52 IST|Sakshi
డబ్బు కష్టాల్లోనూ నాలుగు ఫ్లాట్లకు రూ.119కోట్లు

ముంబయి: పెద్ద నోట్ల రద్దు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేల్‌ అయిందని, ఇకపై ఈ రంగంలో లావాదేవీలు మందగించినట్లేనని నిపుణులు చెప్తుండగా వారంతా అవాక్కయ్యే తీరుగా ముంబయిలో రికార్డు స్థాయిలో ఓ కొనుగోలు జరిగింది. వర్లీలో నాలుగు ఫ్లాట్లను తమ సొంత ప్రాజెక్టు కోసం బిల్డర్లు ఏకంగా రూ.119 కోట్లను పెట్టి కొనుగోలు చేసి చుట్టుపక్కలవారిని బిత్తరపోయేలా చేశారు. ఈ సంస్థకు చెందిన వారికి ఈ ఫ్లాట్లు ఉన్నాయో వారే తిరిగి పెద్ద మొత్తంలో వెచ్చించి తమ సొంత ప్రాజెక్టు అభివృద్ధి పేరిట కొనుగోలు చేయడం పలువురుని ఆశ్చర్య పరుస్తుంది.

వర్లీలో 1973నాటి ప్రాజెక్టులో భాగంగా ఓంకార్‌ రియల్టర్స్‌, డెవలపర్స్‌ పేరిట అపార్టుమెంట్లు ఉన్నాయి. ఈ బిల్డర్స్‌ భాగస్వాములైన బాబులాల్‌ వర్మ, ఓంకార్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనెజింగ్‌ డైరెక్టర్‌ గౌరవ్‌ గుప్తా పేరిట ఈ నాలుగు ఫ్లాట్లను నవంబర్‌ 15న రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇందుకోసం వారు చెల్లించిన మొత్తం రూ.119కోట్లు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా డబ్బులకోసం తీవ్ర ఇక్కట్లు పడుతుండగా ఇంతపెద్ద మొత్తంలో నగదు మార్పిడి ఎలా జరిగిందనేది మొదటిగా తలెత్తుతున్న ప్రశ్న కాగా.. ఇంత పెద్ద మొత్తం పెట్టి సొంత ప్రాజెక్టు పేరిట అదే కంపెనీకి చెందిన వ్యక్తులే కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటని మరోప్రశ్న తలెత్తుతుంది.

కాగా, గత మూడేళ్ల కిందటే తాము వాటిని కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్‌ మాత్రం ఇటీవలె పూర్తయిందని వర్మ వివరణ ఇచ్చారు. తాము కొత్తగా తలపెట్టనున్న ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే తమ​ కంపెనీకి చెందిన పలువురు డైరెక్టర్లు ఇదే మాదిరిగా ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు కూడా తెలిపారు.
 

మరిన్ని వార్తలు