కూలిన భవనం

29 Oct, 2014 00:56 IST|Sakshi
కూలిన భవనం

వర్షాలతో పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వాళ్లు బిక్కుబిక్కుమంటూ  గడపాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి చెన్నైలో ఓ పాత భవనం కుప్ప కూలడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదం నుంచి 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మదురైలో మరో ఇల్లు కూలడంతో ఓ బాలుడు మరణించగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. పాత, పురాతన భవనాల్లో నివాసం ఉంటున్న వాళ్లల్లో ఆందోళన మొదలైంది. కీల్పాకం మిల్లర్స్ రోడ్డులో రెండు అంతస్తులతో కూడిన పాత భవనం ఉంది. పదిహేను ఏళ్ల క్రితం పై అంతస్తులు కల్యాణ మండపంగా ఉండేది. కింది భాగం దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం స్థానిక ఫైనాన్షియర  ఉత్తమ సేన్‌కు చెందినది. ఈ భవనం కింది భాగంలో దుకాణాలకు వెనుక ఉన్న ఇంట్లో ఉత్తమ సేన్ నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటుగా భార్య చంద్ర, కుమార్తె మేనక, బంధువు కమలాబాయ్ ఉంటున్నారు. ఒకటి, రెండు అంతస్తులు ఇది వరకు నివాస ప్రాంతంగా మార్చినా, అక్కడక్కడ పై పెచ్చులు ఊడటంతో వాటిని ప్రస్తుతం ఖాళీగానే ఉంచారు. ఈ పరిస్థితుల్లో సోమవారం అర్ధరాత్రి ఉన్నట్టుండి పైనున్న ఒకటి, రెండు అంతస్తులు కుప్ప కూలాయి. ఈ హఠాత్పరిణామంతో కింద ఉన్న ఇంట్లోని ఉత్తమ సేన్ కుటుంబీకులు భయాందోలన తో బయటకు పరుగులు తీశారు. ఈ భవన శిథిలాలలు పక్కనే ఉన్న సురేష్ ఇంటి మీద పడ్డాయి.
 
 ఆ ఇంట్లోని సురేష్ భార్య ద్రాక్షాయిని, తల్లి త్రిపుర సుందరి, పిల్లలు కిషన్ కుమార్, ప్రత్యూష, సురేష్ సోదరుడు మురేగషన్, ఆయన భార్య దేవయాని భయాందోళనతో బయటకు ఉరకలు తీశారు. భూకంపం వచ్చినట్లుగా, పిడుగు పడ్డట్టుగా వచ్చిన శబ్దంతో ఆ పరిసరవాసులు మరింత ఆందోళనలో పడ్డారు. ఆ భవనం కింది భాగంలో దుకాణాల్లో నిద్రిస్తున్న మరో ముగ్గురు ఈ శబ్దంతో పరుగులు తీశారు. సహాయక చర్యలు : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్ని వేగవంతం చేశారు. భవన శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న ఆందోళనలో పడ్డారు. అయితే, అందరూ బయటకు వచ్చేసినట్టుగా ఉత్తమ సేన్ చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఒకటి రెండు అంతస్తులు కుప్ప కూలినా, కింది భాగంలోని దుకాణాలు, ఇంటి మీద ప్రభావం చూపక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అరుుతే దుకాణాలకు సమీపంలోని ఆపి ఉన్న ఓ కారు, ఓ రిక్షా ధ్వంసమయ్యూరుు.  
 
 మంత్రి పరామర్శ: మంగళవారం ఉదయాన్నే సమాచారం అందుకున్న మంత్రి గోకుల ఇందిర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించారు. అయితే, సురేష్ ఇంటి మీద శిథిలాలు అధికంగా ఉండడంతో ఎవర్నీ ఆ ఇంట్లోకి అనుమతించ లేదు. దీంతో అరుబాక్కంలోని తమ బంధువుల ఇంటికి ఆ కుటుంబం మకాం మార్చాల్సి వచ్చింది. పురాతన భవనానికి మరమ్మతులు చేయాల్సి ఉందని, అయితే, కుటుంబంలోని పరిస్థితుల కారణంగా అలాగే వదలి పెట్టామని ఉత్తమ సేన్ చెప్పారు.
 
 మదురైలో: మదురైలో ఓ ఇల్లు కుప్పకూలడంతో బాలుడు మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. మదురై వాడి పట్టి అమ్మాకోట్టైకు చెందిన బాల సుబ్రమణ్యం, తమిళ్ సెల్వి దంపతులకు అజిత్, సంధ్య, సత్య పిల్లలు ఉన్నారు. ఇటీవల అనారోగ్యం తో బాల సుబ్రమణ్యం మరణించాడు. పిల్లల తో తమిళ్ సెల్వి కాలం గడుపుతున్నారు. అర్ధరాత్రి వర్షం కుండపోతగా కురవడంతో ఆ ఇల్లు పైకప్పు కుప్పకూలింది. వర్షం కారణం గా సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడింది. శిథిలాలకింద చిక్కుకున్న వాళ్లను అతికష్టం గా రక్షించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న తమిళ్ సెల్వి, సత్య, సంధ్యలను ప్రాణాలతో రక్షించారు. అయితే, అజిత్ మీద శిథిలాలు పెద్ద ఎత్తున పడటంతో సంఘటనా స్థలంలోనే మరణించాడు. గాయపడ్డ ముగ్గురినీ చికిత్స నిమిత్తం మదురై ఆసుపత్రికి, అజిత్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  
 

మరిన్ని వార్తలు