దేశాన్ని వణికించిన కేసు.. తేలిపోయింది

18 Jul, 2017 18:01 IST|Sakshi
దేశాన్ని వణికించిన కేసు.. తేలిపోయింది

మోగా: ఆ యువతికి 14 ఏళ్లు. బస్సు ఎక్కిన ఆమెపై బస్సు డ్రైవర్‌ అందులోని అతడి సహయకులు లైంగిక వేధింపులకు పాల్పడి బస్సు నడుస్తుండగా అందులో నుంచి తోసేయడంతో తీవ్ర గాయాలై చనిపోయింది. 2015లో జరిగిన ఈ ఘటనపట్ల దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనే జరిగింది. బాధితురాలు దళిత బాలిక కావడంతో రాజకీయ నాయకులు తామేం తక్కువ కాదని విస్తృతంగా ప్రకటనలు చేస్తూ అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ, చివరకు ఈ సంచలన కేసు తేలిపోయింది. ఆధారాల్లేవని కోర్టు నిందితులను నిర్దోషులుగా వదిలేసింది. దీంతో తన కూతురును చంపేశారంటూ ఫిర్యాదు చేసుకున్న ఆ కన్నతల్లే విరోధిగా మిగిలిపోయింది.

మోగాలో ఏప్రిల్‌ 29, 2015న ఓ దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అనంతరం ఆ బాలికను ఆమెతోపాటు తల్లిని కూడా బస్సులో నుంచి తోసేసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె సోదరుడు కూడా బస్సులోనే ఉన్నాడు. అయితే, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోస్కో చట్టం కింద బస్సు డ్రైవర్‌ రంజీత్‌ సింగ్‌, కండక్టర్‌ సుఖ్‌విందర్‌సింగ్‌, మరో ఇద్దరు సహాయకులు  అమర్‌రామ్‌, గుర్దీప్‌ సింగ్‌ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, తప్పు చేసిన వారిని గుర్తించలేకపోవడం, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వంటి కారణంగా వారందరిని కూడా జిల్లా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. కాగా, ఈ ఘటన సమయంలో బాధితురాలి తండ్రికి కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని నాటి శిరోమణి అకాళీదల్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, అతడు చెప్పులు అరిగేలా తిరిగినా అతడికి ఇప్పటి వరకు ఉద్యోగం కాదు కదా చిన్న సహాయం కూడా అందలేదు.

మరిన్ని వార్తలు