‘బిజినెస్’లో రెండేళ్ల సరికొత్త కోర్సు

27 Mar, 2015 00:50 IST|Sakshi

కోల్‌కతా: దేశంలోని మూడు ప్రఖ్యాత విద్యాసంస్థలు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కోల్‌కతా, ఐఎస్‌ఐ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్) కోల్‌కతా సంయుక్తంగా బిజినెస్ ఎనాలిటిక్స్‌లో కొత్త కోర్సు అందించనున్నాయి. ఈ ఏడాది నుంచే మొదలు కానున్న ఈ కొత్త కోర్సు(పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎనాలిటిక్స్-పీజీడీబీఏ) కాల వ్యవధి రెండేళ్లపాటు ఉంటుందని ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుదీష్ణ సర్కార్ తెలిపారు. కోర్సులో భాగంగా మ్యాథమెటికల్ ఫౌండేషన్, స్టాటిస్టికల్, మెషీన్ లర్నింగ్ అంశాలపై ఐఎస్‌ఐలో మొదటి సెమిస్టర్ ఉంటుంది.

రెండో సెమిస్టర్ ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తుంది. ఇక మూడో సెమిస్టర్ కోల్‌కతా ఐఐఎంలో ఉంటుంది. నాలుగో సెమిస్టర్ కింద ఆరు నెలలపాటు ఏదైనా ప్రముఖ కంపెనీలో ప్రాజెక్టు వర్క్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ ఎనాలిటిక్స్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సర్కార్ పేర్కొన్నారు. 2018 నాటికి ఈ మార్కెట్ విలువ 2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
 
 

మరిన్ని వార్తలు