ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే...

13 Jan, 2020 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల్లో అక్కడక్కడా విధ్వంసకాండ కొనసాగుతోంది. మోటారు వాహనాలను, దుకాణాలను దగ్ధం చేయడం, భద్రతా బలగాలపైకి రాళ్లు రువ్వడం మనం చూస్తున్నాం. ప్రజల ఆగ్రహాన్ని, అసహనాన్ని ఇలా వ్యక్తం చేస్తే తప్పా ప్రభుత్వ ప్రభువులకు అర్థం కాదని వాదించే కార్మిక నాయకులు ఉన్నారు. అల్ప సంఖ్యలో ఉండే వెనక బడిన వర్గాల ప్రజలు తమ అసమ్మతిని అగ్గిలా మండిస్తే తప్పిస్తే ప్రభుత్వ పెద్దలకు కాగ తగలదంటూ సమర్థించే నాయకులూ ఉన్నారు. ఇది ఎంత మేరకు సబబు?

భారత రాజ్యాంగంలోని 19 (1) ఏ సెక్షన్‌ కింద డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళన చేసే హక్కు ప్రజలకు ఉంది. అదే రాజ్యాంగంలోని 51 ఏ అధికరణ కింద హింసాకాండకు దూరంగా ఉండడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది. బాధ్యత విషయాన్ని పక్కన పెడితే విధ్వంసకాండకు పాల్పడిన వారిని శిక్షేందుకు కేంద్ర ప్రభుత్వం 1984లో ‘పివెన్షన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ యాక్ట్‌’ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులకు ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉన్న ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. 

ప్రభుత్వ రవాణా లేదా టెలీ కమ్యూనికేషన్ల ధ్వంసంతోపాట ప్రజల కోసం ఉపయోగపడే భవనం లేదా కేంద్రం పబ్లిక్‌ ప్రాపర్టీ (ప్రభుత్వ ఆస్తులు)గా చట్టం నిర్వచించింది. ఇటీవల లక్నోలో జరిగిన ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతోపాటు ప్రైవేటు వాహనాలైనా కార్లు, బైకులను కూడా తగులబెట్టారు. ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టారు. ప్రైవేటు పాపర్టీ విధ్వంసం విషయంలో చర్యలు తీసుకునేందుకు చట్టంలో సరైన నిబంధనలు లేదు. సుప్రీం కోర్టు ఈ విషయంలో ఎన్నోసార్లు జోక్యం చేసుకొని చట్టంలో అవసరమైన సవరణలు తీసుకరావాల్సిందిగా ఆదేశించినా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోయాయి. 

2007లో సుప్రీం కోర్టు స్పందన
ఆ సంవత్సరం దేశవ్యాప్తంగా సమ్మెలు, బంద్‌లు, ఆందోళనల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన భారీ నష్టంపై తనంతట తాను స్పందించిన సుప్రీం కోర్టు, సరైన మార్గదర్శకాల కోసం రిటైర్డ్‌ సుప్రీం కోర్టు జడ్జీ కేటీ థామస్, సీనియర్‌ న్యాయవాది ఫాలి నారిమన్‌ నాయకత్వంలో రెండు వేర్వేరు కమిటీలను నియమించింది. 1984 చట్టాన్ని సవరించాల్సిందిగా ఆ రెండు కమిటీలు పలు సూచనలు చేశాయి. 

2015లో గుజరాత్‌లో హార్దిక్‌ పటేల్‌ ఆందోళన, 2016లో హర్యానాలో కోటా కోసం జాట్లు నిర్వహించిన ఆందోళన సందర్భంగా కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి ఆందోళనలకు పిలుపునిచ్చిన సంఘాలను బాధ్యులను చేస్తూ చట్టం తీసుకరావాలని సూచించింది. సరైన చట్టాలు లేని కారణంగానే నాడు హార్దిక పటేల్‌పై పోలీసులు ‘దేశ ద్రోహం’ కేసు పెట్టారు. అది వీగిపోయింది. ఇటీవల ఎన్‌ఏఏ చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ తీసుకరాగా ‘దేశంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పాడ్డాకే విచారిస్తాం’ అని వ్యాఖ్యానించడం కూడా ఇక్కడ గమనార్హం. 

చదవండి:

సీఏఏపై వెనక్కి తగ్గం

మమతా బెనర్జీకి అమిత్ షా సవాల్..

బెంగాల్ సహా దేశమంతటా సీఏఏ

పౌర చట్టంపై విపక్షాల రాద్ధాంతం

దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది : గవాస్కర్

సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు

మరిన్ని వార్తలు