జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్‌

11 Nov, 2017 02:25 IST|Sakshi

పలు ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. వారి వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని  అధ్యక్షతన శుక్రవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్‌లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌.బసంత్‌ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్‌ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్‌ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు.   

ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ కేంద్రం
ఎగ్జిబిషన్‌ మార్కెట్‌లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ), నాన్‌–పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఏన్‌టీఏ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్‌టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం(ఎన్‌ఆర్‌డీడబ్యూపీ) పునర్వ్యవస్థీకరణకు 2017–18 నుంచి 2019–20 వరకూ రూ. 23,050 కోట్లు ఖర్చు చేసేందుకు ఓకే చెప్పింది.

>
మరిన్ని వార్తలు