గోవుల కమిషన్‌కు ఆమోదం

7 Feb, 2019 05:52 IST|Sakshi

వ్యవసాయ మార్కెట్ల మౌలిక నిధికి రూ. 2 వేల కోట్లు

పైరసీకి పాల్పడితే మూడేళ్ల జైలు, పది లక్షల జరిమానా

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ: ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధి కోసం కొత్తగా ఓ కమిషన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’ పేరుతో ఏర్పాటయ్యే ఈ కొత్త కమిషన్‌ ఆవుల సంరక్షణ, వాటి సంతాన వృద్ధికి సబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుందనీ, దీని ద్వారా దేశీయ జాతులకు చెందిన పశుసంపద పెరుగుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ చెప్పారు. రైతులు, మహిళల ఆదాయం పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయ మార్కెట్‌ మౌలిక నిధి (ఏఎంఐఎఫ్‌)ను రూ. 2 వేల కోట్లతో సృష్టించేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. నాబార్డ్‌ ద్వారా సృష్టించే ఈ నిధి గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు, క్రమబద్ధీకరించిన హోల్‌సేల్‌ మార్కెట్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగపడనుంది.

సినిమాటోగ్రాఫ్‌ చట్ట సవరణకు ఆమోదం
సినిమాటోగ్రాఫ్‌ చట్ట సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 10 లక్షల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి విధించాలని ప్రతిపాదించారు. దీనిద్వారా హరియాణాలో ఉన్న ఎన్‌ఐఎఫ్‌టీఈఎం, తమిళనాడు తంజావూరులోని ఐఐఎఫ్‌పీటీలకు జాతీయ విద్యా సంస్థల హోదా లభిస్తుంది. ప్రసార భారతికి వచ్చే మూడేళ్లలో వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాల కోసం రూ. 1,054 కోట్లను కేటాయించనున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో సవరించిన ఆఫీస్‌ మెమొరాండం (ఓఎం)కు ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు