అమిత్‌ షా రధయాత్రకు హైకోర్టు నో

6 Dec, 2018 18:11 IST|Sakshi
బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా (ఫైల్‌ఫోటో)

సాక్షి, కోల్‌కతా : బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌లో శుక్రవారం పాల్గొనాల్సిన రధయాత్రకు కలకత్తా హైకోర్టు గురువారం అనుమతి నిరాకరించింది. బెంగాల్‌ అంతటా పలు జిల్లాల్లో సాగే ఈ మెగా ర్యాలీనీ అమిత్‌ షా లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో బీజేపీ బెంగాల్‌  శాఖ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 9న తదుపరి విచారణ చేపడతామని అప్పటివరకూ రధయాత్రను వాయిదా వేయాలని హైకోర్టు కోరింది.

కాగా రధయాత్రకు అనుమతి నిరాకరించిన కలకత్తా హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తామని బీజేపీ బెంగాల్‌ ఇన్‌చార్జ్‌ విజయ్‌వర్గీయ వెల్లడించారు.కాగా, కూచ్‌బెహర్‌ సమస్యాత్మక ప్రాంతమని, అక్కడ ఇలాంటి ర్యాలీకి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డిసెంబర్‌ ఏడు నుంచి రాష్ట్రంలో మూడు ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి కోసం తాము దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వ అధికారులు, పోలీసుల నుంచి స్పందన లేదని పేర్కొంటూ బీజేపీ బుధవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు