‘రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజునా చూసేది..’

27 Apr, 2017 10:22 IST|Sakshi
‘ఈవీఎంలను కాదు.. మనల్ని చెక్‌ చేసుకుందాం’
న్యూఢిల్లీ: సొంతపార్టీ నేతల నుంచే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు పరాభవం ఎదురవుతోంది. ఓటమిని ఈవీఎంలపై తోసివేసి తప్పుకోవడం సరికాదని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ హవా ఉన్నా లేకపోయినా ఆప్‌ ఓడిపోయిందన్నమాట ఇప్పుడు వాస్తవం అంటూ ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజు ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ పరోక్షంగా తమ పార్టీ అధినేతకు హితబోధ చేశారు. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాల అనంతరం ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఆరోపించారు.

అయితే, దీనిపై ఆప్‌ నేత ఢిల్లీ మంత్రి కపిల్‌ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘రెండేళ్ల తర్వాత ఇలాంటి రోజును ఎందుకు చూడాల్సి వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రధాని మోదీ హవా ఉన్నా లేకపోయినా ప్రజలు మనకు ఓటు వేయలేదని స్పష్టమైంది. 2015 పొందిన విజయంతోపోలిస్తే అతి తక్కువ సీట్లు మాత్రమే వచ్చాయని తేటతెల్లమైంది. ఫలితాలను ఒక్క ఈవీఎంలను అపఖ్యాతి చేస్తూ మాత్రమే చెప్పలేము’ అని ఆయన అన్నారు. అయితే, ఏదేమైన ఆత్మవిమర్శ అత్యవసరం అని ఇది తన వ్యక్తి గత అభిప్రాయం అని చెప్పారు. మరోపక్క, ఢిల్లీలో బీజేపీ హవా ఉందని ఒప్పుకున్నారు. అయితే, ఇదే పార్టీకి చెందిన కార్మిక మంత్రి మాత్రం మోదీ హవా లేదని ఈవీఎంల హవా ఉందంటూ ఆరోపించారు.  
మరిన్ని వార్తలు