97 మంది చిన్నారుల మృతి: కేంద్రమంత్రిపై కేసు నమోదు

17 Jun, 2019 17:37 IST|Sakshi

97కి చేరిన బిహార్‌ చిన్నారుల మృతుల సంఖ్య

నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిపై ఫిర్యాదు

పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధితో చిన్నారులు మృతిచెందుతున్న విషయం తెలిసిందే. వ్యాధికి కారణమైన అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌పై అవగహన కల్పించడంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్‌ విఫలమయ్యారని బిహార్‌కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రితో సహా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి మంగల్‌ పాండే పేరును కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. ఆమె ఫిర్యాదు మేరకు ముజఫర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 308, 504 ప్రకారం కేసు ఫైల్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మృతి చెందుతున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ నెల 24న పిటిషన్‌పై ముజాఫర్‌పూర్‌ కోర్టు విచారణ చేపట్టనుంది.

ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారులు బలవుతున్నారు. ఇప్పటి వరకు 97 మంది చిన్నారులు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో శ్రీకృష్ణ, కేజ్రీవాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారే అధికం. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా బిహార్‌లోని ఓ ఆసుపత్రిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమీక్షించిన విషయంతెలిసిందే. మరోవైపు సీఎం నితీష్‌ కుమార్‌ కూడా వైద్యులతో సమావేశమై.. ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.

కాగా, కేంద్రమంత్రి కళ్లెదురే ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించింది. ఓ వైపు పిల్లలు చనిపోయిన బాధ, మరోవైపు తమ పిల్లల్ని కాపాడంటి అంటూ ఆవేదనతో ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రలు చేస్తున్న అర్థనాదాలు ఆకాశాన్నంటాయి. మెదడు వాపు వ్యాధి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు తెలిపారు. అక్యూట్ ఎన్‌సిఫలైటిస్ సిండ్రోమ్‌కు అధిక ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతం ఎక్కువగా ఉండడమే కారణమని వెల్లడించారు. వర్షాలు పడితే పరిస్థితిలో మార్పు వస్తుందని, మరణాలు కూడా తగ్గే అవకాశముందని చెప్పారు.

మరిన్ని వార్తలు