విద్యార్థిని కిడ్నాప్ చేస్తూ.. కెమెరాలో చిక్కారు

28 Dec, 2015 15:59 IST|Sakshi
విద్యార్థిని కిడ్నాప్ చేస్తూ.. కెమెరాలో చిక్కారు

గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న గుర్గావ్ నగరంలో కాలేజీ విద్యార్థిని కిడ్నాప్ కథ సుఖాంతమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కొన్ని గంటల వ్యవధిలో బాధితురాలి ఆచూకీని గుర్తించారు. కిడ్నాపర్ల బారి నుంచి ఆమెను రక్షించారు. సీసీటీవీ ఫుటేజీలో లభ్యమైన ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి పోలీసులు ఈ కేసును తొందరగా ఛేదించారు. వివరాలిలా ఉన్నాయి.


సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుర్గావ్ ఎంజీ రోడ్డులోని గురు ద్రోణాచార్య కాలేజీకి వచ్చిన ఓ విద్యార్థిని.. కాలేజీ గేటు వద్ద అందరూ చూస్తుండగానే దుండగులు బలవంతంగా కారులోకి లాక్కుని తీసుకెళ్లారు. కిడ్నాపర్లు కేవలం 10 సెకెన్లలోనే ఈ తతంగాన్ని ముగించారు. కారులో నలుగురు వ్యక్తులు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విద్యార్థిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలు కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు సీసీటీవీ ఫుటేజిలో గుర్తించారు. ఈ అమ్మాయిని కిడ్నాపర్లు కారులో తీసుకెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆమెను రక్షించేందుకు కారు వెంట పరిగెత్తినట్టు కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్నిగంటల తర్వాత బాధితురాలిని రక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

>
మరిన్ని వార్తలు